భాగవత తృతీయస్కంధంలోని విదుర-మైత్రేయ సుదీర్ఘ సంవాదం స్వారస్యంగా సాగుతోంది. భగవంతుని అవతారాలు బహువిధాలు, అనంతాలు- క్రియాప్రధానాలు, వివేక, వైరాగ్య, ధర్మ, జ్ఞాన ప్రధానాలు. జిజ్ఞాసువైన జీవునికి ఎప్పటికైనా జన్మరాహిత్యం తప్పదేమోకాని, ‘ధర్మసంస్థా పనార్థాయ సంభవామి యుగేయుగే’ అని ఘోషించిన అచ్యుతదేవుని అవతారాలకు అంతం అనేది లేదు.
‘ప(38వ భాగానికి అనుబంధం)
‘పరోపకృతి కైవల్యే తోలయిత్వా జనార్దనః, గుర్వీం ఉపకృతిం మత్వా అవతారాన్ దశాగ్రహీత్’- పరోపకారం, పరమోత్కృష్టమైన మోక్ష పురుషార్థం- ఈ రెంటినీ త్రాసులో తూచి జనహితం, జగత్కల్యాణం కొఱకు జనార్దనుడు పరోపకారాన్నే పరమార్థంగా ఎంచుకొని, లోకదృష్టిలో నీచ, నికృష్టమైన మత్స్య, కూర్మ, వరాహాది జన్మలు ఎత్తడానికికూడా ఏవగింపుతో జంక లేదు. ‘సర్వము తాన యైన వాడెవ్వడు’- అంతా తానే అయిన అనంతునికి ఉచ్చ, నీచాలనే చింత రవ్వంత కూడా ఉండదు కదా! వరాహావతారం క్రియాశక్తి ప్రధానం.
ఇక, సూకర రూపంలోని సౌకర్యం- అవతార అంతరార్థం! ‘విష్ణుపత్నీం మహీం దేవీం’- భూదేవి విష్ణు భగవానుని భార్య. భూమికి ఉన్న శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ- ఈ ఐదు గుణాల్లో ‘గంధం’ ప్రధానగుణం. ఆమె ‘గంధవతి’- అనగా, గంధ తన్మాత్ర యొక్క కార్యం. గంధాన్ని గ్రహించే శక్తి నాసిక(ముక్కు)కు మాత్రమే ఉన్నదన్న విషయం అందరికీ అనుభవమే. బ్రహ్మదేవుని ముక్కునుంచి పుట్టింది కాన, పందికి ఘ్రాణశక్తి మిక్కుటంగా ఉంటుంది. ఘ్రాణేంద్రియంలోంచి ఘోణి (పంది) పుట్టడం ఈక్షోణి (భూమి)మీద కన్నదీ కాదు, విన్నదీ కాదు అని మనం పుక్కిటి పురాణంగా కొట్టి పారేస్తాం. సృష్టి గురించి ధ్యానించగానే స్రష్ట-బ్రహ్మదేవుని ఆయా అవయవాల నుంచి పదిమంది ప్రజాపతులు- మరీచి, అత్రి, అంగిరాదులు పది ఇంద్రియాలవలె పదిమంది ఆధ్యాత్మిక ఋషులు ఆవిర్భవించారు. ఇదంతా మానస సృష్టి!
సృష్టి తత్తం తెలియనివారే ఇది విని నవ్వుకుంటారు. ధాత (బ్రహ్మ) శరీరం మనలాగా సప్తధాతుమయం, పాంచభౌతికం కాదు. అది దివ్యసూక్ష్మ శరీరం. కలలో ఏ శరీర అవయవం నుంచైనా ఏ శరీరమైనా పుట్టడం మనం కంటున్నాము కదా! ప్రళయజలాలలో ప్రవేశించి అట్టడుగున ఉన్న అవని-భూమిని అన్వేషిస్తూ, దానిని వాసనద్వారా పసిగట్టడానికి జగజ్జెట్టి అయిన జనార్దనుడు ఘ్రాణేంద్రియ ప్రధానమైన ‘సూకర’ శరీరాన్ని స్వీకరించాడు. అందుకే, పంది నలువ-బ్రహ్మయొక్క నాసికనుంచి పుట్టినట్లు పురాణకథ పేర్కొంటుంది. భగవంతునికి భూమి-భూదేవి అంటే, అంతటి అవ్యాజమైన అనురాగం. జంతు ప్రపంచంలోని ఉభయచరాలలో ‘భూమి’మీద సూకరానికి ఉన్నంత సహజమైన ప్రేమ (పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా) మరే జంతువుకీ ఉండదన్న విషయం విజ్ఞులకు విదితమే.
మ. ‘చతురామ్నాయ వపుర్విశేషధర! చంచత్సూకరాకార! నీ
సిత దంష్ర్టాగ్ర విలగ్నమైన ధర రాజిల్లెం గులాద్రీంద్ర రా
జిత శృంగోపరి లగ్న మేఘము గతిం జెల్వారి, విద్వజ్జనాం
చిత హృత్పల్వల లోల! భూరమణ! లక్ష్మీనాథ! దేవోత్తమా!’
‘సూం సూం కరోతి ఇతి సూకరః’- నిచ్చలు (ఎప్పుడూ) సూం సూం అంటూ ఎంత రొచ్చు-రొచ్చుగా ఉన్నా మెచ్చుకొంటూ మట్టిని తన ముట్టెతో హెచ్చుగా కుళ్లగిస్తూనే ఉంటుంది కిటి-పంది. వరాహదేవుని ముఖం ఎప్పుడూ భూమికి అభిముఖమే! అవనిమీది అత్యంత అపవిత్రమైన అంశాన్నైనా- అమేథ్యమైనా (మలమైనా) ఎంతో ఆప్యాయతతో ఆరగిస్తుంది. ఇది దాని ఉపాధి-దేహధర్మం. ‘అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా, యస్సరే త్పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః’- పవిత్రుడైనా, అపవిత్రుడైనా- ఎట్టి పరిస్థితిలో ఉన్నా ఏ పుండరీకాక్షుని స్మరించే పురుషమాత్రుడు అంతఃబాహ్యాలలో పూర్ణపవిత్రుడవుతాడో, అట్టి పురుషోత్తమునికి పవిత్ర-అపవిత్రతలని ఉంటాయా? ఈ వరాహావతార తత్తాన్ని అనంతశ్రీ అఖండానందస్వామి ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు.
‘అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే, సదా ఏక (సదైక) రూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే’- పందిగా కనిపించినా, నందిగా అగుపించినా పరమాత్మ పరమాత్మే! అచ్యుతుడు అపరిణామి- మార్పు లేనివాడు! వరాహంగా విరాజిల్లుతున్నా విష్ణువు కార్యం కాదు, సమస్త విశ్వానికి – సర్వనామ రూపాలకి పరమ కారణం! ఈ అవతారంలోనే ఆదివరాహమూర్తి వలన అవని-భూదేవికి పుత్త్రుడు ‘నరకుడు’
ఆవిర్భవించాడు.
మహర్షులు, మునులు మోదముతో ఉత్ప్రేక్షిస్తూ (ఉత్ప్రేక్షాలంకారంలో) ముచ్చటించిన మూలశ్లోకాన్ని- ‘త్రయీమయం రూప మిదం చ సౌకరం..’ సహజ పండితుడు పోతన ఉపమా అలంకార మండితం కావించి, భక్తి రసాప్లావితంగా అనువదించి యజ్ఞవరాహస్వామికి విజ్ఞతతో వందన చందనాలర్పించాడు-
నాలుగు వేదాలే విశిష్ట దేహంగా విరాజిల్లే ఓ యజ్ఞ వరాహస్వామీ! ఓ సుందర సూకర రూప గోవిందా! నీవు మనీషుల- విద్వాంసుల మనోహర హృదయాలనే నీటి మడుగులలో మేటి కిటి (వరాహం)వై క్రీడిస్తూ ఉంటావు. ఓ భూసతికి పతి అయిన భాస్కరద్యుతి! ఓ శ్రీసతికి గతి అయిన గోవిదాంపతీ! ఓ సురసార్వభౌమా! నీ తెల్లని కోర చివర కుదురుగా కూర్చున్న భూమి, కొండల రాజైన మేరు పర్వతపు వెండి శిఖరం మీద శోభిస్తున్న నీలమేఘం వలె అందంగా
చెలువొందుతున్నది.
శక్తికి, శక్తిమంతునికి అభేదాన్ని శీలించు శంకర భగవత్పాదులు ‘సౌందర్యలహరీ’ స్తోత్రంలో శ్రీదేవి పాదకమల పరాగలేశాన్ని స్తుతిస్తూ- ‘జన్మజలధౌ, నిమగ్నానాం దంష్ర్టా మురరిపు వరాహస్య భవతి’ అంటారు. అమ్మా! నీ పాద అరవిందాల పరాగరేణువు జనన మరణ సంసార సముద్రంలో మునిగి దిక్కు తెలియని, గట్టుకు రాలేని వారికి మురారి-విష్ణువు యొక్క వరాహ అవతారంలో ‘దంష్ర్టా’ అనగా ఉద్ధరించే ‘కోర’ అవుతోంది కదా! బ్రహ్మదేవుని ద్వితీయ పరార్థం ప్రారంభంలో విష్ణువు వరాహరూపం పొందిన కాలం శ్వేత వరాహకల్పం. వర్తమానంలో ఈ వరాహకల్పమే వర్ధిల్లుతోంది.
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006
ఇవీ కూడా చదవండి…
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఈ నెల 6న ఏకాంతంగా కల్యాణ వేంకటేశ్వరస్వామి పుష్పయాగం
యాదాద్రిలో ప్రారంభమైన ఆర్జిత సేవలు