రాంచీ: ప్రేమించడం లేదన్న కోపంతో ఒక యువకుడు బాలికను కత్తితో పొడిచి, తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఖరోంధి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరివాడిహ్ గ్రామానికి చెందిన 19 ఏండ్ల ఇమ్తేయాజ్ అన్సారీ, 9వ తరగతి విద్యార్థిని 15 ఏండ్ల షబ్నమ్ ఖాతూన్ను ప్రేమ పేరుతో కొంత కాలంగా వేధిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం క్లాస్మేట్స్తో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఆమెను అతడు అడ్డుకున్నాడు. అనంతరం కత్తితో పొడవడంతో ఆ బాలిక ప్రతిఘటించింది. దీంతో తన వద్ద ఉన్న నాటు తుపాకీతో దగ్గర నుంచి కాల్పులు జరుపడంతో ఆమె మరణించింది. అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, తన రెండో కుమార్తె షబ్నమ్ను, అన్సారీ గత రెండేండ్లుగా వేధిస్తున్నాడని మృతురాలి తల్లి ఆరోపించింది. ఈ విషయాన్ని పేరెంట్స్కు చెప్పడంతో వారు అతడ్ని కొట్టారని తెలిపింది. అయినప్పటీ తమ కుమార్తెను వేధించడాన్ని అతడు ఆపలేదని, చంపుతానని కూడా పలుమార్లు బెదిరించాడని బాలిక తల్లి ఆరోపించింది.