మీరట్ : కజిన్తో ప్రేమలో పడిన యువకుడిని ఆమె కుటుంబసభ్యులు చావబాదిన ఘటన యూపీలోని మీరట్లో వెలుగుచూసింది. గర్ల్ఫ్రెండ్ కుటుంబసభ్యులు యువకుడిని తీవ్రంగా కొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని మొహల్లా ధర్మపురికి చెందిన షాబుద్దీన్ (25)గా గుర్తించారు. కజిన్తో పీకల్లోతు ప్రేమలో మునిగిన షాబుద్దీన్ను ఆమె కటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా ఆమెతో సంబంధం కొనసాగించాడు.
దీంతో ఆగ్రహానికి లోనైన బాలిక కుటుంబసభ్యులు అతడిపై దాడికి తెగబడి దారుణంగా హింసించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అంకుల్ కూతురుతో ప్రేమ వ్యవహారం నడిపించిన యువకుడు తన భార్యను వదిలేసి కజిన్ను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. దీనికి బాలిక కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపి యువకుడిని హెచ్చరించారు.
పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకునేందుకు వారు సిద్ధపడటంతో బాలిక కుటుంబసభ్యులు యువకుడిని హత్య చేశారు. షాబుద్దీన్ విధులు ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా కాపుకాసిన నిందితులు కర్రలతో దాడి చేశారు. కేసు నమోదు చేసిన మీరట్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.