అహ్మదాబాద్ : ఏడుగురు కూతుర్లున్న ఓ మహిళ మగ బిడ్డ కోసం గాంధీనగర్ ప్రభుత్వ దవాఖాన నుంచి నవజాత శిశువును కిడ్నాప్ చేసింది. బాధితురాలి నుంచి బిడ్డను అపహరించేందుకు మహిళ నర్సుగా నమ్మబలికింది. పోలీసులు కేసును చేధించి చిన్నారిని తల్లి చెంతకు చేర్చారు. నిందితురాలిని 30 ఏండ్ల అస్మిత భారతిగా గుర్తించారు. నిందితురాలు, ఆమె భర్తను బనస్కంత జిల్లాలో గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మార్చి 28న మహిళ దవాఖానలో చేరి ఏప్రిల్ 1న మగబిడ్డకు జన్మనిచ్చింది. డిశ్చార్జి అయ్యే సమయంలో నర్సుగా పరిచయం చేసుకున్న అస్మిత మహిళతో కలిసి ఆమెకు సహాయకురాలిగా బాధితురాలి ఇంటికి వెళ్లింది.
ఆపై తిరిగి చెకప్ కోసం మహిళతో కలిసి అస్మిత దవాఖానకు వచ్చింది. ఈ క్రమంలో మహిళ నుంచి బిడ్డను గుంజుకుని పారిపోయింది. నేరంలో అస్మితకు ఆమె భర్త సహకరించాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు 200 కెమెరాల నుంచి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. నిందితురాలు దవాఖాన నుంచి నవజాత శిశువును తీసుకుని రిక్షాలో వెళుతున్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో వెల్లడైంది. ఎట్టకేలకు బనస్కంత ప్రాంతంలో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు నవజాత శిశువును రక్షించి తల్లికి అప్పగించారు.