కోల్కతా: మటన్ అమ్మే వ్యక్తి ఒక మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతునులిమి హత్య చేశాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ దారుణం జరిగింది. సిల్పరా సమీపంలోని పుర్బా బరిషా ప్రాంతానికి చెందిన 52 ఏండ్ల మహిళ, ఆమె భర్త మానసిక పరిస్థితి సరిగా లేదు. దీంతో వారి పిల్లలు బంధువుల వద్ద ఉంటున్నారు.
కాగా, శుక్రవారం రాత్రి ఆ మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మటన్ షాప్లో పని చేసే నోహజారి నివాసి ఖైరుల్ మోండల్ అలియాస్ రాజు, ఆమెను గమనించాడు. మద్యం సేవించి ఉన్న అతడు ఆ మహిళను అనుసరించి లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కోపంతో గొంతునులిమి హత్య చేశాడు. మృతురాలి ఇంటికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న ఠాకూర్పుకూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితుడు ఖైరుల్ను అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో ఆ మహిళ పట్ల చెడుగా ప్రవర్తించానని, ఆమె ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని జాయింట్ సీపీ (క్రైమ్) మురళీధర్ శర్మ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.