లక్నో: లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఫిర్యాదు చేసిన మహిళా టీచర్పై నిందితుడు ఫిర్యాదు చేశారు. మరో ముగ్గురితో కలిసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించాడు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్ మేనేజర్ భర్త విరేష్ శర్మ తనను హోటల్కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు మహిళా టీచర్ ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, విరేష్ శర్మ ఆ మహిళా టీచర్పైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్నేహితులు రాజన్, అమిర్, రాజబహుదూర్తో కలిసి డబ్బుల కోసం ఆమె తనను బ్లాక్మెయిల్ చేసిందని ఆరోపించాడు. జూన్ 21న తనను హోటల్కు రమ్మని ఆ టీచర్ పిలిచిందని తెలిపాడు. దీంతో ఆ రాత్రంతా అక్కడ ఉన్నట్లు చెప్పాడు.
అయితే తామిద్దరం కలిసి ఉన్న వీడియోను ఆమె రికార్డు చేసిందని విరేష్ శర్మ తెలిపాడు. ఆ వీడియోను స్నేహితుడైన రాజన్కు పంపిందని చెప్పాడు. ఆమె ముగ్గురు స్నేహితుల్లో ఒకరు తనకు ఫోన్ చేసి ఆ వీడియో చూపించి రూ.6 లక్షలు డిమాండ్ చేశారని తెలిపాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోను వైరల్ చేస్తామని బెదిరించాడని ఆరోపించాడు. దీంతో వారికి తాను లక్ష ఇచ్చానని పోలీసులకు తెలిపాడు.
మరోవైపు జూలైలో వారు ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారని, దీంతో ఆ టీచర్ తనపై ఫిర్యాదు చేసిందని విరేష్ శర్మ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఆధారాలు పరిశీలించిన పోలీసులు డబ్బుల కోసం బ్లాక్మెయిల్కు కుట్ర పన్నిన ఆ మహిళపై కేసు నమోదు చేశారు.