డెహ్రాడూన్: కుటుంబ గొడవల నేపథ్యంలో కత్తితో భర్త గొంతుపై పొడిచి భార్య హత్య చేసింది. అనంతరం అతడి మృతదేహాన్ని ఇంటి టెర్రస్ పైనుంచి కిందకు పడేసింది. ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీదీహత్ ప్రాంతంలోని చిన్పట్టా గ్రామానికి చెందిన 35 ఏండ్ల కుందన్ సింగ్ ధామి తన ఇంటి టెర్రస్ పైనుంచి పడి మరణించినట్లు అక్టోబర్ 17న పోలీసులకు సమాచారం అందింది. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా అతడి మరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు తన అన్న మరణానికి వదిన నీమా దేవి కారణమంటూ మృతుడి సోదరుడు ధన్ సింగ్ ధామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెకు మరో వ్యక్తితో సంబంధం వల్ల కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించాడు. దీంతో పోలీసులు నీమా దేవిని అరెస్ట్ చేసి ప్రశ్నించగా తన నేరాన్ని ఒప్పుకున్నది.
అక్టోబర్ 17న తమ మధ్య ఘర్షణ జరిగిందని, దీంతో కత్తితో భర్త కుందన్ గొంతు కోసి హత్య చేశానని నీమా దేవి తెలిపింది. భర్త మృతదేహాన్ని గోనె సంచిలో టెర్రస్ పైకి తెచ్చి అక్కడ నుంచి కిందకు పడేసినట్లు ఆమె చెప్పిందని పోలీసులు వెల్లడించారు. హత్యకు వినియోగించిన కత్తి, గోనె సంచిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శుక్రవారం నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు తెలిపారు.