గౌహతి: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు బీఫ్ను బహుమతిగా పంపుతున్నా అంటూ వాట్సాప్లో పోస్ట్ చేసిన ఒక యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను బెయిల్పై విడుదల చేశారు. నల్బరి జిల్లాకు చెందిన ఒక యువతి బుధవారం వధించిన ఆవు ఫొటోను వాట్సాప్లో పోస్ట్ చేసింది. దీనిని సీఎం హిమంత బిస్వా శర్మకు గిఫ్ట్గా పంపుతున్నా అని అందులో పేర్కొన్నది. ఈద్ నేపథ్యంలో బుధవారం ఆ యువతి చేసిన ఈ పోస్ట్పై పోలీసులు స్పందించారు. మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ఉన్న ఈ పోస్ట్ చేసిన ఆమెను కొంత సేపు అరెస్ట్ చేశారు. బెయిలబుల్ నేరం కావడంతో అనంతరం ఆ యువతిని బెయిల్పై విడుదల చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, నిందితురాలు నల్బరిలోని కమర్కుచి గ్రామానికి చెందిన బీజేపీ మైనారిటీ మోర్చా మాజీ నాయకుడి కుమార్తె.
అస్సాంలో పశువుల అక్రమ రవాణా, గొడ్డు మాంసం అమ్మకాలను నియంత్రించడానికి అస్సాం పశు సంరక్షణ చట్టం 2021ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చింది. హిందూ, జైన, సిక్కు, గొడ్డు మాంసం తినని ఇతర వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో లేదా ఏదైనా ఆలయానికి 5 కిలోమీటర్ల పరిధిలో బీఫ్ అమ్మడం, కొనడాన్ని ఈ చట్టం ద్వారా నిషేధించారు. కాగా, ఈ చట్టం అమలులోకి వచ్చిన అనంతరం జరిగిన తొలి అరెస్ట్ ఇదేనని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ యువతి వాట్సాప్ పోస్ట్పై స్థానిక విశ్వహిందూ పరిషత్ కూడా ఫిర్యాదు చేసింది.