లక్నో: ఒక పెంపుడు కుక్క ఇంట్లోని వృద్ధురాలిపై దాడి చేసి చంపింది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. రిటైర్డ్ స్కూల్ టీచర్ అయిన 83 ఏళ్ల సుశీలా త్రిపాఠి, చిన్న కుమారుడితో కలిసి లక్నో నగరం బెంగాలీ తోలా ప్రాంతంలోని ఖైజర్బాగ్లోని ఇంట్లో నివాసం ఉంటున్నది. వారికి రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. అందులో ఒకటి పిట్ బుల్. కాగా, మంగళవారం ఉదయం ఇంటి మేడపై ఉన్న ఆ వృద్ధురాలిపై ఆ కుక్క దాడి చేసింది. ఆమెను కరిచి చంపింది. రక్తం మడుగుల్లో పడి ఉన్న వృద్ధురాలు సుశీలాను గమనించిన ఇంటి పనిమనిషి వెంటనే ఆమె కుమారుడికి సమాచారం ఇచ్చింది. దీంతో వారు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు.
మరోవైపు ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో ఆ వృద్ధురాలి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో లక్నో మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన అధికారుల బృందం బుధవారం ఆ ఇంటికి వెళ్లింది. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పిట్ బుల్ డాగ్ను పెంచుకునే లైసెన్స్ ఉందా లేదా అన్నది తెలుసుకునేందుకు ఆ ఇంటికి వెళ్లినట్లు పశువైద్యుడు డాక్టర్ అభినవ్ వర్మ తెలిపారు. బొచ్చుతో పొట్టిగా ఉండే పిట్ బుల్ డాగ్స్ను శిక్షణ లేని వ్యక్తులు పెంచుకోవడం చాలా ప్రమాదకరమని అన్నారు.