దస్తురాబాద్ :నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో గంటల వ్యవధిలో ఇద్దరు భార్యభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అల్తాటి పెద్దన్న (60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నాలుగు రోజుల నుంచి నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. మరణిం చిన పెద్దన్న మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చిన రెండు గంటల వ్యవధిలోనే గురువారం ఉదయం భార్య మంగవ్వ (55)కు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయాలు నెలకొన్నాయి.
వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండగా, కుమార్తెకు వివాహం కాగా, కుమారులకు ఇంకా వివాహం కాలేదు. దేవునిగూడెం గ్రామంలో భార్యభర్తలు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, మండల ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాన్ని గురువారం పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజరమేశ్ రావు, సర్పంచ్ ముష్కే అంజన్న, పీఏసీఎస్ డైరెక్టర్లు వెంకన్న, నారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అర్గుల రాజనర్సయ్య, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎండపెల్లి గంగన్న తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.