అహ్మదాబాద్ : కరోనా సెకండ్ వేవ్ తో కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుంటే ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణాధార మందులను బ్లాక్ మార్కెట్ చేసి కొందరు అందినకాడికి దండుకుంటున్నారు. గుజరాత్ లోని ఓ దవాఖానలో వార్డ్ బాయ్ రెమ్డిసివిర్ లో గ్లూకోజ్ వాటర్ కలిపి అవసరమైన రోగులకు అధిక దరలకు అమ్ముతూ సొమ్ము చేసుకున్న ఘటన వెలుగుచూసింది. జగదీష్ పర్మర్ అనే వార్డ్ బాయ్ నదియాద్ సివిల్ ఆస్పత్రిలో పనిచేస్తూ నెలన్నరగా ఇదే పనిలో ఉన్నాడు.
రెమ్డిసివిర్ బాటిల్స్ లో గ్లూకోజ్ నీళ్లను కలిపి కొవిడ్ రోగులు, బంధువులకు బాటిల్ ను రూ 4500 నుంచి రూ 5000 వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. రెమ్డిసివిర్ బాటిల్స్ లో 60 శాతం గ్లూకోజ్ వాటర్ ను నిందితుడు కలిపేవాడు. బాటిల్ పై బ్రాండ్ స్టిక్కర్లు ఉండటంతో వీటిని నకిలీవని ఏ ఒక్కరూ గుర్తించలేదని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.