భువనేశ్వర్: తనిఖీ కోసం వచ్చిన పోలీసులను దొంగల ముఠాగా భావించిన గ్రామస్తులు కర్రలు, ఇతర ఆయుధాలతో కొట్టారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మచ్కుండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మతిఖల్ గ్రామంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పొరుగున ఉన్న మల్కన్గిరి జిల్లాకు చెందిన సుమారు 40 మంది పోలీసులు శుక్రవారం రాత్రి వేళ సివిల్ దుస్తుల్లో ఆ గ్రామానికి వెళ్లారు. పలు ఇళ్లల్లో తనిఖీలకు ప్రయత్నించారు.
కాగా, పోలీసులను దోపిడీ దొంగలుగా భావించిన గ్రామస్తులు వారిపై రాళ్లతో దాడి చేశారు. కర్రలు, పదునైన ఆయుధాలతో కొట్టారు. దీంతో కొందరు పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు. గ్రామస్తుల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన మచ్కుండ్ పోలీసులు వెంటనే అక్కడకు వచ్చారు. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరు పోలీసుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు ఆ గ్రామంలోని ఒక ఇంటి నుంచి 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు. అయితే రైడ్కు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు రాళ్లు రువ్వి కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. దీంతో పలువురు పోలీసులు గాయపడినట్లు చెప్పారు. గంజాయి స్మగ్లర్లతో కొందరు పోలీసులకు సంబంధం ఉండవచ్చని, దీనిని తోసిపుచ్చలేమని అన్నారు.