కొడంగల్ : కార్తీక మాసం పురస్కరించుకుని శివాలయాలు కార్తీక దీపాలతో వెలిగిపోయాయి. ప్రతి రోజు ఉదయం, సాయంత్ర వేళల్లో శివాలయాల్లో కార్తీక దీపాలను మహిళలు వెలిగించి స్వామివారికి దర్శించుకొని తరిస్తున్నారు. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమని, అదే విధంగా కార్తీక సోమవారానికి మరింత ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఇందులో స్థానిక మహాదేవుని ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శివుడికి పంచామృతాభిశేకం, బిల్వార్చన, అష్టోత్తర శతనామావళి వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తులు ఘనంగా నిర్వహించారు.
అనంతరం ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలోని వేప, మరి చెట్టుతోపాటు ఉసిరి చెట్టుకు కార్తీక దీపాలను వెలిగించి పసుపు కుంకుమల వాయినాలను అందించుకున్నారు. అదే విధంగా పౌర్ణమి సందర్భంగా మహిళలు ఇంట్లో పెంచుకున్న తులసి మొక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమలతో అర్చన చేసుకొని నైవేద్యంతో పాటు మంగళహారతులు అందించి, వాయినాలను అందించి ఆశీర్వచనాలను అందుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాల అందజేశారు.