చెన్నై: మద్యం రవాణా చేస్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మద్యం బాటిళ్లను స్థానికులు లూటీ చేశారు. తమిళనాడులోని మధురైలో ఈ ఘటన జరిగింది. సుమారు పది లక్షల విలువైన మద్యాన్ని రవాణా చేస్తున్న వాహనం మధురై సమీపంలోని విరగనూరు ప్రాంతంలోని జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో మద్యం సీసాలున్న పెట్టెలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. గమనించిన స్థానికులు అందినకాడికి మద్యం సీసాలు, పెట్టెలను తమ వెంట తీసుకుపోయారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో ఆ జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు మద్యం సీసాలు, పెట్టెలను స్థానికులు పట్టుకెళ్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఏప్రిల్ 20న మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. బీరు క్యాన్లతో వెళ్తున్న వాహనం బర్వానీలోని వంతెనపై ఒక కారును ఢీకొట్టింది. దీంతో వంతెనపై చెల్లాచెదురుగా పడిన బీరు క్యాన్లను అటుగా వెళ్తున్న వారు పట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మిగతా బీర్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు.