చెన్నై: అమెరికా నుంచి తిరిగొచ్చిన దంపతులను పనివాళ్లు హత్య చేశారు. రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ దారుణం జరిగింది. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన 60 ఏళ్ల శ్రీకాంత్, 55 ఏళ్ల భార్య అనురాధ అమెరికాలోని కుమార్తె ఇంటికి వెళ్లి శనివారం చెన్నై తిరిగి వచ్చారు. కాగా, నేపాల్ దేశీయుడైన కృష్ణణ్ వారింట్లో పని మనిషిగా తాత్కాలిక కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. స్నేహితుడు రవితో కలిసి ఆ దంపతులను దారుణంగా హత్య చేశాడు. చెన్నై శివారులోని వారి ఫార్మ్హౌస్లో మృతదేహాలను పూడ్చిపెట్టారు. దోచుకున్న రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో తమ దేశమైన నేపాల్కు పారిపోసాగారు.
మరోవైపు అమెరికాలోని కుమార్తె తన తల్లిదండ్రులకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ఏదో జరిగినట్లు అనుమానించిన ఆమె స్థానిక బంధువులకు ఫోన్ చేసి అలెర్ట్ చేసింది. శ్రీకాంత్, ఆయన భార్య అనురాధ వారింట్లో కనిపించకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా పని మనిషి కృష్ణణ్, స్నేహితుడు రవి ఆంధ్రప్రదేశ్ మీదుగా నేపాల్కు పారిపోతున్నట్లు గుర్తించారు. వారు ఎక్కడ ఉన్నది అన్నది సాంకేతికంగా పసిగట్టారు. దీంతో ఏపీ పోలీసులను అప్రమత్తం చేయగా ఒంగోల్లో నిందితులను అరెస్ట్ చేశారు.
మరోవైపు దంపతుల హత్యకు సంబంధించి నిందితుల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నట్లు చెన్నై పోలీస్ అధికారి కన్నన్ తెలిపారు. రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను కూడా రికవరీ చేసినట్లు చెప్పారు. ఇటీవల రియల్ ఎస్టేట్ డీల్ నేపథ్యంలో ఆ దంపతుల ఇంట్లో రూ.40 కోట్ల నగదు ఉంటుందని భావించిన పనిమనిషి కృష్ణణ్, దోపిడీ కోసం వారి హత్యకు ప్లాన్ చేశాడని వివరించారు. ఫార్మ్హౌస్లో పూడ్చిన దంపతుల మృతదేహాలను వెలికి తీసి పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.