జైపూర్: చెంపపై కొట్టారన్న అవమానంతో పొరుగింటి వ్యక్తి, అతడి కుమారుడ్ని మరో వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. రాజస్థాన్లోని భరత్పూర్లో ఈ ఘటన జరిగింది. శనివారం సురేంద్ర సింగ్ అనే వ్యక్తి పొరుగింటి లఖన్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి మద్యం సేవించాడు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో సురేంద్ర బంధువు ఒకరు లఖన్ సింగ్ చెంపపై కొట్టాడు. చాలా అవమానంగా భావించిన లఖన్ సింగ్ దీనిపై సురేంద్రను హెచ్చరించాడు.
కాగా, ఆదివారం ఈ గొడవపై రాజీపడేందుకు సురేంద్ర, లఖన్ తమ అనుచరులతోపాటు చర్చించుకుంటున్నారు. ఇంతలో లఖన్ ఒక్కసారిగా తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సురేంద్ర సింగ్తోపాటు అతడి 17 ఏండ్ల కుమారుడు సచిన్ మరణించారు. కాగా, ఇద్దరు వ్యక్తులు నాటు తుపాకీలు ఎక్కుపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పోలీసులు లఖన్ సింగ్, దిలావర్, మరో 12 మందిపై హత్య కేసు నమోదు చేశారు. దిలావర్కు కూడా తుపాకీ గాయాలయ్యాయని, తమ కస్టడీలో ఉన్న అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు భరత్పూర్ ఎస్పీ దేవేంద్ర బిష్ణోయ్ తెలిపారు. పరారీలో ఉన్న ఇతర నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మరోవైపు ఈ గొడవపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం చేశారని మృతుడి కుటుంబం ఆరోపించింది. దీనిని సీరియస్గా తీసుకున్న ఎస్పీ బిష్ణోయ్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఎస్పీ విజయ్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ మాన్ సింగ్ను సస్పెండ్ చేశారు.
.