లక్నో: భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో వ్యాపారవేత్త అయిన స్నేహితుడ్ని మరో వ్యక్తితో కలిసి భర్త హత్య చేశాడు. రోడ్డు ప్రమాదంలో అతడు మరణించినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే ప్లాన్ పారకపోవడంతో అరెస్ట్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
మూడు వారాల కిందట పుంతర్ హైవేపై లారీని కారు ఢీకొన్నట్లుగా జరిగిన ఘటనలో వ్యాపారవేత్త సంజయ్ వర్మ మరణించాడు. అతడు మద్యం సేవించి డ్రైవ్ చేయడంతో ప్రమాదానికి గురై చనిపోయినట్లు పోలీసులు తొలుత భావించారు. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా అతడ్ని గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు దర్యాప్తు జరుపగా సంజయ్ మర్డర్ మిస్టరీ వీడింది.
వ్యాపారి సంజయ్ శర్మ, ప్రవీణ్ పటేల్ స్నేహితులు. సంజయ్ తరచుగా పటేల్ ఇంటికి వచ్చేవాడు. అతడి భార్యతో ఫోన్లో మాట్లాడేవాడు. దీంతో తన భార్యతో సంజయ్కు వివాహేతర సంబంధం ఉందని పటేల్ అనుమానించాడు. అతడ్ని హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.
అక్టోబర్ 31న పార్టీ పేరుతో సంజయ్ను పటేల్ తన ఇంటికి పిలిచాడు. మద్యం సేవించిన సంజయ్ను అనుచరుడు అజిత్ కుమార్ వర్మతో కలిసి తాడును గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం సంజయ్ మృతదేహాన్ని కారులో తీసుకెళ్లారు.
జాతీయ హైవే మీద డ్రైవింగ్ సీటులో సంజయ్ మృతదేహాన్ని ఉంచారు. ఎక్సలేటర్ రైజ్ చేసి పటేల్, అజిత్ కారు నుంచి బయటకు జంప్ చేశారు. దీంతో ఆ కారు ఒక లారీని ఢీకొన్నది. ఇలా రోడ్డు ప్రమాదంలో సంజయ్ మరణించినట్లుగా చిత్రీకరించేందుకు చేసిన వారి ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో ప్రవీణ్ పటేల్, అజిత్ కుమార్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించగా తమ నేరాన్ని ఒప్పుకున్నారని పోలీస్ అధికారి తెలిపారు.