లక్నో: ఉత్తర ప్రదేశ్ అయోధ్య పరిధిలోని ఆలయంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిద్ర పోతున్న వ్యక్తి గొంతు కోసి బంధువు హతమార్చాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అయోధ్య జిల్లాలోని కుమార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. అమేథీకి చెందిన 35 ఏళ్ల పంకజ్ శుక్లా ఇటీవల అమ్మమ్మ, తాతయ్య ఊరైన అయోధ్య జిల్లాలోని భూపూర్ గ్రామానికి వచ్చాడు. గత రెండు నెలలుగా అతడు ఆ గ్రామంలో ఉంటున్నాడు. శనివారం రాత్రి గ్రామంలోని ఆలయం అరుగుపై నిద్రపోయాడు. అయితే కజిన్ గుల్లు మిశ్రా అతడి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు, గ్రామంలోని ఆలయంలో వ్యక్తి హత్యకు గురైనట్లు ఆదివారం ఉదయం గ్రామస్తులు గమనించారు. షాకైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితుడైన ఆ వ్యక్తి బంధువు గుల్లు మిశ్రాను అరెస్ట్ చేశారు.
కాగా, పంకజ్ శుక్లా, గుల్లు మిశ్రా మధ్య గతంలో పోట్లాట జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కక్షతోనే ఆలయం అరుగుపై నిద్రిస్తున్న పంకజ్ గొంతు కోసి మిశ్రా హత్య చేశాడని తెలిపారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుడిలో హత్య జరుగడం స్థానికంగా కలకలం రేపింది.