నోయిడా: ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక హౌసింగ్ సొసైటీ నివాసితులపై ఎనిమిది మంది సెక్యూరిటీ గార్డులు బుధవారం దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మంది సెక్యూరిటీ గార్డులను గురువారం అరెస్ట్ చేశారు. నోయిడాలోని సెక్టార్ 100లో లోటస్ బౌలేవార్డ్ హౌసింగ్ సొసైటీలో బుధవారం తాళం చెవి విషయంపై ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో యూనిఫామ్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఒక వ్యక్తిపై కర్రలు, ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన మరొకరిపైనా దాడి చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన పోలీస్ కమిషనర్ అలోక్ సింగ్ దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో పోలీసులు ఇద్దరు నివాసితులపై దాడి చేసిన ఎనిమిది మంది సెక్యూరిటీ గార్డులను గురువారం అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, అల్లర్లకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. సీఐఎస్ఎస్ బ్యూరో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ లైసెన్స్ను తనిఖీ చేయడంతోపాటు అందులో పని చేసే సెక్యూరిటీ గార్డుల తీరుపై ఆరా తీస్తున్నారు.