లక్నో: ఉద్యోగం నుంచి తొలగించినందుకు కక్ష పెంచుకున్న ఇద్దరు వ్యక్తులు వైద్యుడి కుమారుడ్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఛతారి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక వైద్యుడి ఎనిమిదేండ్ల కుమారుడు శుక్రవారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళన చెందిన బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు.
ప్రాథమికంగా లభించిన సమాచారంతో రెండేండ్ల కిందట ఆ వైద్యుడు తొలగించిన ఇద్దరు మాజీ ఉద్యోగులు నిజాం, షాహిద్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించారు. ఆ ఇద్దరు కూడా గతంలో ఆ వైద్యుడి వద్ద కాంపౌండర్లుగా పని చేశారు. పొరపాట్లు చేస్తుండటంతో వారిని ఉద్యోగం నుంచి ఆ డాక్టర్ తొలగించారు.
దీనిపై పగ పెంచుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు డాక్టర్ కుమారుడ్ని శుక్రవారం కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ బాలుడ్ని హత్య చేశామని పోలీసులకు చెప్పారు. దీంతో వారిద్దరిని ఛతారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేబాయి సర్కిల్ ఆఫీసర్ వందనా శర్మ తెలిపారు.