లక్నో: ఒక బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేశారు. అయితే పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ ఘటన జరిగింది. 17 ఏండ్ల దళిత బాలిక గత వారం పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ నెల 3న ఆమె మృతదేహాన్ని పొలాల్లో గుర్తించారు. బాలిక ముఖంపై గాయాలుండటంతో మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. సామూహిక లైంగిక దాడి తర్వాత బాలికను గొంతునులిమి హత్య చేసినట్లుగా నిర్ధారణ అయ్యింది.
కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. పోలీసులు ఈ కేసుపై సీరియస్గా స్పందించారు. నిందుతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందించిన వారికి రూ.25,000 రివార్డు కూడా ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గ్రహించారు.
ఈ నేపథ్యంలో శనివారం ఇద్దరు నిందితులను వేర్వేరు చోట్ల అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే వీరిద్దరి అరెస్ట్ సందర్భంగా పోలీసులు కాల్పులు జరుపాల్సి వచ్చిందని చెప్పారు. కాల్పుల్లో కాలికి గాయమైన ఒక వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడని వెల్లడించారు.
మరోవైపు, ముగ్గురు నిందితులకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు బాలిక పొరుగింటి వ్యక్తి అని, మరొకరు ఆమెకు తెలిసిన వ్యక్తి అని చెప్పారు. మరో నిందితుడు పొరుగు గ్రామానికి చెందిన వ్యక్తి అని, ఈ ముగ్గురు కలిసి బాలికపై సామూహిక లైంగిక దాడి చేసి అనంతరం గొంతునులిమి ఆమెను హత్య చేశారని పోలీస్ అధికారి తెలిపారు.