భోపాల్: ఒక వ్యక్తి మద్యం తాగాడు. అయితే కిక్ ఇవ్వకపోవడంతో కల్తీ మద్యంగా అధికారులకు ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జాయిని జిల్లాలో ఈ ఘటన జరిగింది. బహదూర్ గంజ్ నివాసి అయిన లోకేష్ సోథియా ఏప్రిల్ 12న ఒక లిక్కర్ షాపులో నాలుగు క్వార్టర్ల దేశీయ మద్యం సీసాలు కొన్నాడు. స్నేహితుడితో కలిసి రెండు క్వార్టర్ల మద్యం సేవించాడు. అయితే కిక్ ఇవ్వలేదు. మత్తు ఎక్కకపోవడంతో ఆ మద్యం కల్తీదని భావించాడు. మద్యంలో నీళ్లు కలిపారని ఆరోపించాడు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాతోపాటు ఉజ్జాయిని ఎక్సైజ్ కమిషనర్ ఇందర్ సింగ్ దామోర్కు దీనిపై ఫిర్యాదు చేశాడు.
కాగా, పెయిడ్ పార్కింగ్ నిర్వహించే తాను గత 20 ఏళ్లుగా నిత్యం మద్యం సేవిస్తానని లోకేష్ సోథియా తెలిపాడు. దీంతో మద్యం రుచి, క్వాలిటీ గురించి తనకు భాగా తెలుసని అన్నాడు. ఆహారం, ఆయిల్ వంటి ఇతర వస్తువుల వలే మద్యాన్ని కూడా కల్తీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. నీళ్లు కలిపి కల్తీ మద్యం అమ్మిన షాపుపై వినియోగదారుల కోర్టును కూడా ఆశ్రయించాడు. తాను కొనుగోలు చేసిన మిగతా రెండు క్వార్టర్ మద్యం బాటిల్స్ను దీనికి సాక్ష్యంగా ఉంచానని చెప్పాడు.
మరోవైపు లోకేష్ ఫిర్యాదుపై మంత్రి నరోత్తమ్ మిశ్రాతోపాటు ఉజ్జయిని ఎక్సైజ్ కమిషనర్ ఇందర్ సింగ్ దామోర్ స్పందించారు. దీనిపై విచారణ జరిపి సంబంధిత లిక్కర్ షాపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, కల్తీ మద్యం అమ్మిన లిక్కర్ షాపుపై వినియోగదారుల కోర్టులో చీటింగ్ కేసు పెట్టినట్లు లోకేష్ తరుఫు న్యాయవాది నరేంద్ర సింగ్ ధాక్డే వెల్లడించారు.