కోల్కతా: తాపీ మేస్త్రీలతో ప్రేమలో పడిన ఇద్దరు మహిళలు, తమ భర్తలను విడిచిపెట్టి వారితో పారిపోయారు. పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిశ్చిందా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో ఒక ఇంటి నిర్మాణం జరుగుతున్నది. ఆ ఇంటికి చెందిన ఇద్దరు వివాహిత మహిళలు పని చేసే తాపీ మేస్త్రీలతో ప్రేమలో పడ్డారు. ఈ నేపథ్యంలో తమ భర్తలను వీడి వారితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఒక మహిళ తన ఆరేండ్ల కుమారుడ్ని వెంట తీసుకెళ్లింది. వారంతా తమ మొబైల్ ఫోన్లను ఆఫ్ చేశారు.
మహిళలు కనిపించకపోవడంతో అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక మహిళ ఫోన్ కాల్ లిస్ట్ను పరిశీలించగా ఈ విషయం తెలిసింది. దీంతో పోలీసులు తాపీ మేస్త్రీల సొంతూరు ముర్షిదాబాద్కు వెళ్లి ఆరా తీశారు.
కాగా, ఆ తాపీ మేస్త్రీలు ఇద్దరు మహిళలను తొలుత తమ ఇండ్లకు తీసుకెళ్లారు. అనంతరం ఆ రెండు జంటలు ముంబై వెళ్లాయి. ఈ విషయం తెలిసిన స్థానిక పోలీసులు ముంబై పోలీసులను సంప్రదించి ఆ నలుగురిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక పోలీస్ బృందాన్ని ముంబైకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.