చెన్నై : బాయ్ఫ్రెండ్తో కలిసి ఆస్పత్రికి వెళుతున్న మహిళపై మార్చి 17న సామూహిక లైంగిక దాడి ఘటనలో ఇద్దరు మైనర్లు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెల్లూరు ఎస్పీకి బాధితురాలు మార్చి 22న ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ మార్చి 17 రాత్రి 1 గంట ప్రాంతంలో బాయ్ఫ్రెండ్తో కలిసి ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి బయలుదేరారు.
ఆ సమయంలో ఆటోలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఆటోడ్రైవర్ వేరే రూట్లో తీసుకెళ్లడంతో వారు అతడిని ప్రశ్నించగా రిపేర్ల కోసం మెయిన్ రోడ్ మూసివేశారని చెబుతూ వేగంగా నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. వారిని కత్తితో బెదిరించి సెల్ఫోన్, రూ 45,000 నగదు, గోల్డ్ కాయిన్స్ను దోచుకుని ఆపై మహిళపై ఐదుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇక లూటీ సొమ్మును పంచుకోవడంలో విభేదాలు రావడంతో తాగిన మైకంలో ఘర్షణ పడుతున్న ఇద్దరిని వెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు నేరాన్ని అంగీకరించారని చోరీ సొత్తు పంచుకోవడంలో విభేదాలు తలెత్తాయని వారు చెప్పారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరు మైనర్ల ఆచూకీ గురించి తెలపగా వారిని అరెస్ట్ చేసిన పోలీసులు ఐదో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.