మారేడ్పల్లి : రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఐ ఫోన్ -13 ప్రో మాక్స్, ఆపిల్ వ్రిస్ట్ వాచ్ ( 1,80,000 విలువ), 18,000 వేల విలువచేసే మరో మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం…ఏపిలోని విశాఖపట్నం ప్రాంతానికి చెందిన పరిగి బీమరాజు (33) శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటూ సెక్యూరీటి గార్డుగా పని చేస్తున్నాడు. జార్ఖండ్ ప్రాంతానికి చెందిన గౌతం కుమార్ యాదవ్ (20), టోలిచౌకి ప్రాంతంలో నివాసం ఉంటూ కూలీ పని చేస్తున్నాడు.
జల్సాలకు అలవాటు పడ్డ వీరిద్దరు రైళ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల్లా నటిస్తూ…ప్రయాణికుల సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు అందడడంతో వీరి పై నిఘాను పెంచారు.
కాగా గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీరిద్దరు వేరు వేరు ప్రాంతాల్లో అనుమానస్పదంగా తిరుగుతుండగా…రైల్వే పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నారు. నింధితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.