న్యూఢిల్లీ: గర్ల్ ఫ్రెండ్కు ఖరీదైన గిఫ్ట్ కోసం ముగ్గురు యువకులు ఒక ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. నైరుతి ఢిల్లీలోని సరోజినీ నగర్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 7న, మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముగ్గురు వ్యక్తులు సరోజినీ నగర్కు చెందిన ఆదిత్య కుమార్ ఇంటి డోర్ బెల్ రింగ్ చేశారు. ఇంట్లో ఒంటిరిగా ఉన్న ఆయన తలుపు తెరువగా వారు తుపాకీతో బెదిరించి బలవంతంగా అతడి ఇంట్లోకి ప్రవేశించారు. ఆదిత్య కుమార్ను కొట్టి ఒక చోట కట్టేశారు. ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, దుస్తులున్న బ్యాగ్, షూ, వాచ్తోపాటు ఆయన స్కూటర్ను దోచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఒక ఎంఎన్సీ కంపెనీ సీఈవో అయిన ఆదిత్య కుమార్ ఎలాగోలా కట్లు విడిపించుకుని మరో ల్యాప్టాప్ నుంచి ఫేస్బుక్ ద్వారా బంధువులకు ఈ విషయాన్ని తెలుపారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదిత్య కుమార్ ఇంట్లో జరిగిన దోపిడీని పరిశీలించారు. ఆ ప్రాంతంలో సీసీటీవీలు లేకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు.
కాగా, మాటల సందర్భంలో ఒక వ్యక్తిని మరో వ్యక్తి శుభం అని పిలిచినట్లు బాధితుడు ఆదిత్య కుమార్ పోలీసులకు చెప్పారు. దీంతో ఆ పేరుతో ఉన్న 150 మంది నేరస్తుల ఫైళ్లను పరిశీలించి నిందితుడ్ని గుర్తించారు. శుక్రవారం దోచుకున్న స్కూటర్పై సరోజిని నగర్లో వెళ్తున్న 20 ఏండ్ల శుభంతోపాటు అతడితో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారిని 19 ఏండ్ల ఆసిఫ్, 41 ఏండ్ల మహ్మద్ షరీఫుల్ ముల్లాగా గుర్తించారు.
ఈ ముగ్గురికి నేర చరిత్ర ఉన్నదని పోలీసులు తెలిపారు. శుభంపై రెండు, ఆసిఫ్, ముల్లాపై మూడు చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు. రెండు స్కూటర్లు, ఒక ల్యాప్టాప్, నాలుగు మొబైల్ ఫోన్లు, దుస్తులతో కూడిన ఒక బ్యాగ్, బూట్లు, చేతి వాచీని వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది జూలైలో సరోజిని నగర్లో మొబైల్ ఫోన్లు చోరీ చేసిన కేసులో అరెస్టైన శుభం నవంబర్లో విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. అతడి వైఖరితో అసంతృప్తితో ఉన్న ప్రియురాలిని ఖరీదైన బహుమతులతో సంతృప్తి పరిచేందుకు జైల్లో పరిచయమైన ఇద్దరితో కలిసి తాజాగా ఈ దోపిడీకి ప్లాన్ చేశాడని వెల్లడించారు.