భోపాల్: ఒక పులిని కొందరు చంపి దాని శరీరానికి బండ రాళ్లు కట్టి బావిలో పడేశారు. మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్(బీటీఆర్)కు చెందిన టీ-32 పేరున్న 14 ఏండ్ల ఆడ పులిని గుర్తు తెలియని వ్యక్తులు గాయపరిచి చంపేశారు. అనంతరం పులి మృతదేహానికి రెండు బండ రాళ్లు కట్టి మన్పూర్ బఫర్ జోన్ పరిధిలోని తమ్నా బాసా గ్రామం సమీపంలోని బావిలో పడేశారు.
ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పులి కలేబరాన్ని బావి నుంచి పైకి తీశారు. దాని ముఖంపై పదునైన ఆయుధం వల్ల కలిగిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. పులి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించినట్లు బీటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విన్సెంట్ రహీమ్ తెలిపారు. పులి మరణంపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
కాగా, ఈ ఆడ పులి ఇప్పటి వరకు ఐదుసార్లు ఈనిందని, పలు పులి పిల్లలకు జన్మనిచ్చిందని విన్సెంట్ తెలిపారు. గణాంకాల ప్రకారం బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లో వందకుపైగా పెద్ద పులులు ఉన్నాయని వెల్లడించారు.