చెన్నై : ఆన్లైన్ క్లాసుల కోసం వినియోగించాల్సిన మొబైల్ ఫోన్లను ఓ ముగ్గురు విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించారు. ఫోన్లలో అసభ్యకరమైన వీడియోలు చూసి.. 9 ఏండ్ల బాలుడిని లైంగిక వేధింపులకు గురి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని ట్యుటికోరిన్లో వెలుగు చూసింది.
9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు(8వ తరగతి) ఆన్లైన్ క్లాసుల కోసం మొబైల్ ఫోన్లను కొన్నారు. అయితే ఈ ఫోన్లలో ఆ ముగ్గురు విద్యార్థులు కలిసి అసభ్యకరమైన వీడియోలను చూశారు. ఈ క్రమంలో పొరుగింట్లో ఉన్న 9 ఏండ్ల బాలుడిని తమ వద్దకు పిలిపించుకుని ఆ వీడియోలను చూపించారు. ఆ వీడియోల్లో మాదిరిగానే చేయాలని సదరు బాలుడిని బలవంతం పెట్టారు. అలా నెలన్నర పాటు లైంగిక వేధింపులకు గురి చేశారు. దీంతో బాధిత అబ్బాయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
ఈ క్రమంలో జనవరి 5న ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 15 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఇక తన పట్ల ఆ ముగ్గురు విద్యార్థులు ప్రవర్తించిన తీరును తల్లిదండ్రులకు తెలియజేశాడు. దీంతో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు విద్యార్థులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.