అహ్మదాబాద్: ప్రియుడితో కలిసి ఉన్న మహిళపై నలుగురు వలస కూలీలు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. గుజరాత్లోని సూరత్లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 11న నలుగురు వ్యక్తులు దేవదా-కుంభారియా రోడ్లో మూత్ర విసర్జనకు వెళ్లారు. నిర్మానుష్య ప్రాంతంలో ఒక జంట ఒంటరిగా ఉండటం వారు చూశారు. వారి వద్దకు వెళ్లి మహిళ ప్రియుడ్ని కొట్టి రెండు చేతులు కట్టేశారు. ఆ మహిళను సమీపంలోని అరటి తోటలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, జరిగిన దారుణంపై ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వారు చెప్పిన పోలికల ఆధారంగా నిందితుల ఊహా చిత్రాలు గీయించారు. వాటిని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. అందులోని ఒక వ్యక్తి రాజీవ్నగర్ మురికివాడలో నివసిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు చివరకు అతడ్ని అరెస్ట్ చేశారు.
అయితే తనకేమీ తెలియదని తొలుత ఆ వ్యక్తి బుకాయించాడు. అతడి ఫొటోను బాధితురాలి ప్రియుడి మొబైల్కు పంపగా నిందితుల్లో ఒకరుగా వారు గుర్తించారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా చివరకు అతడు నోరు విప్పాడు. ఇతర నిందితుల సమాచారం ఇచ్చాడు.
దీంతో బీహార్కు చెందిన వలస కూలీలైన 22 ఏళ్ల విదేశీ అలియాస్ వికాస్ అలియాస్ తక్లా యాదవ్, జితేంద్ర, పశ్చిమ బెంగాల్కు చెందిన 25 ఏళ్ల గోపాల్ సుఖ్ దేవ్ మన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగో నిందితుడు దీపక్ యాదవ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన బాధితురాలు సూరత్లోని సోదరి ఇంట్లో ఉంటూ స్థానిక జరీ యూనిట్లో నాలుగు నెలలుగా పని చేస్తున్నదని పోలీసులు వెల్లడించారు.