పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదలవుతుంది అంటే అభిమానుల ఆనందాలకు అడ్డుకట్ట వేయలేం. రాజకీయాల వలన మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్.. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ మార్చి 29 సాయంత్రం 6గం.లకు తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఏరియాలలో ఉన్న థియేటర్స్లో ప్లే చేశారు. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. బాణా సంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు శ్రీరామ్ వేణు, దిల్ రాజుతో పాటు ఇతర యూనిట్ సభ్యులు కూడా హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు ఏరియాలలో ఉన్న థియేటర్లో ట్రైలర్ విడుదల చేయగా, వైజాగ్లోని ఓ ప్రాంతంలో అభిమానులు థియేటర్ అద్ధాలు పగలగొట్టుకొని మరీ లోపలికి ప్రవేశించారు. ఈ ప్రమాదంలో కొందరు గాయపడినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, దీనిపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.