సైదాబాద్: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క పిల్ల (ఒరియో)ను గుర్తు తెలియని యువకుడు ఇంటి ముందు నుంచి తీసుకెళ్లాడు. కన్పించకుండా పోయిన కుక్క పిల్ల ఆచూకీ తెలుసుకోవాలని ఓ జంతు ప్రేమికుడు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మలక్పేట బి-బ్లాక్ పార్క్ సమీపంలో నివాసముంటున్న జలమండలి ఉద్యోగి ఇందూరి తిరుపతి భార్య లత దంపతులు జంతు ప్రేమికులు. వీరు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క పిల్ల శుక్రవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకుడు తనతో పాటు తీసుకుని వెళ్లాడు.
కుక్క పిల్లకోసం స్థానికంగా గాలించినప్పటికీ ఫలితం లేక పోవటంతో తమ కుక్క పిల్లను వెతికిపెట్టాలని కోరుతూ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అనుమానిత యువకుడు కుక్క పిల్లను తీసుకెళ్లిన సమయంలో స్థానిక పార్క్లో వాకింగ్ చేస్తున్న ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో ఆతని ఫొటో తీశాడని బాధితులు పోలీసులకు తెలిపారు. అనుమానితుడి ఫొటోను పోలీసులకు అందజేసి ఆచూకీ తెలుసుకోవాలని కోరారు. ఈ మేరకు సైదాబాద్ పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా పుటేజ్ల ఆధారంగా కుక్క పిల్లను తీసుకెళ్లిన యువకుడి దృశ్యాలను పరిశీలించి, అనుమానితుడి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.