అమరావతి : మద్యం మత్తు ఎంతటి దారుణానికైన ఒడిగడుతుందని ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఘటనలు కళ్లకు కట్టినట్లు కనబడుతున్నాయి. మహిళపై ఘోరాలు , నేరాలు జరుగుతుంటే అమాయకులు సైతం వీరి బారిన పడి హత్యకు గురవుతున్నారు. ఇచ్చిన ఇడ్లి తినలేదన్న కక్షతో ఓ ముగ్గురు బిచ్చగాడిపై ప్రతాపం చూపి దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు అర్బన్ ప్రాంతంలోని నల్లపాడు పరిధిలో చోటుచేసుకుంది.
ఈనెల 1వ తేదిన అర్ధరాత్రి మహేశ్ అనే వ్యక్తి మద్యం సేవించి వచ్చి తన వెంట తెచ్చుకున్న ఇడ్లీ పొట్లాన్ని బిచ్చగాడికి ఇస్తూ నువ్వు చడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుడిలా ఉన్నావు. పోలీసులతో జాగ్రత్త అంటూ వ్యంగ్యంగామాట్లాడాడు. దీంతో మనస్థాపానికి గురైన బిచ్చగాడు ఇడ్లీపొట్లాన్ని విసిరేశాడు. దీంతో కోపంతో వెళ్లిపోయిన మహేశ్ కొద్దిసేపటికి అతడి స్నేహితులు అనిల్, సతీశ్తో కలిసి వచ్చి బిచ్చగాడిపై దాడి చేశారు. అతడిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డులో మరోసారి దాడి చేయడంతో బిచ్చగాడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను గురువారం అదుపులోకి విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ జెస్సి ప్రశాంతి మీడియా సమావేశంలో తెలిపారు.