ఇస్లామాబాద్ : వివాహితకు మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్ని వీడియో రికార్డు చేసి బ్లాక్మెయిల్కు పాల్పడిన స్కూల్ టీచర్ ఉదంతం పాకిస్తాన్లో కలకలం రేపింది. చినియత్లోని ప్రభుత్వ హైస్కూల్లో పనిచేసే నిందితుడు మహిళ కుమారుడికి తన ప్రైవేట్ అకాడమీలో శిక్షణ ఇస్తున్నాడు. నిందితుడి నిర్వాకంపై మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసిందని డాన్ పత్రిక పేర్కొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుమారుడి చదువు గురించి మాట్లాడాలనే సాకుతో మహిళను తన అకాడమీకి నిందితుడు తరచూ పిలిపించేవాడు. ఇక మహిళ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇటీవల ఓ పకీరు వద్దకు వెళ్లింది. అక్కడ పకీరు, నిందితుడు కలిసి ఆమెకు మత్తుమందు ఇచ్చారు. ఆపై మహిళను ఇంటివద్ద దింపుతానని నమ్మబలికిన నిందితుడు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడి దృశ్యాలను వీడియోలో రికార్డు చేశాడు.
అప్పటినుంచి వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తూ మహిళ నుంచి పది తులాల బంగారం కాజేశాడు. మరోసారి రూ 2,50,000 నగదు వసూలు చేశాడు. అయినా మరికొంత డబ్బు ఇవ్వాలని బాధితురాలిని బెదిరించాడు. నిందితుడు కోరిన మొత్తం ఇవ్వకపోవడంతో మహిళ వీడియోను ఆమె బంధువులకు పంపాడు. నిందితుడి వేధింపులతో విసిగిన మహిళ భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఆరోపణలు రావడంతో అతడిని సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.