ఖైరతాబాద్ : ఓ వైపు దీపావళికి నగరం సిద్ధమవుతున్న వేళ….ఓ ముక్కు పచ్చలారని బాలిక విగతజీవిగా మారింది. నిత్యం ప్రజలు సంచరించే ఆ ప్రాంతంలో ఓ చిన్నారి మృతదేహం కలకలం రేపింది. సుమారు 5 నుంచి ఆరేండ్ల లోపు వయస్సు గల ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….పంజాగుట్టలోని ద్వారకాపురికాలనీలో నిరూపయోగంగా ఉన్న షట్టర్ గది వద్ద గురువారం ఉదయం ఓ బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హత్యా…లైంగికదాడా….ఆస్తికోసమా…?
బాలిక మృతదేహంపై గులాబి రంగు పైజామా, బూడిద రంగు టీషర్టు, పచ్చరంగు మాస్క్, ముఖంపై పెద్దలు వేసుకునే మంకీ క్యాప్ ఉంది. పాప మృతిచెందిన తీరు చూస్తే ముఖంపై కమిలిన గాయాలతో పాటు కుడి చేయి విరిచినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో హత్య జరిగి ఉంటుందా….?
లేక లైంగిక దాడి చేసి చంపేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేశారా…? ఆస్తి కోసం బంధువులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా…? ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పడి ఉన్న చోటు నుంచి నిత్యం వందలాది వాహనాలు, ప్రజలు సంచరిస్తుంటారు.
దీంతో అర్థరాత్రి లేక తెల్లవారు జామున ఎవరో ఇక్కడ తెచ్చి పడేసి ఉంటారేమోనన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహం పడి ఉన్న చోట ఖాళీ మద్యం బాటిళ్లు
బాలిక విగతజీవిగా పడి ఉన్న చోట గతంలో ఓ ఎంబ్రాయిడరీ షాపు ఉండేది. ప్రస్తుతం అది వాడుకలో లేకపోవడంతో షాపు షట్టర్ మొత్తం జంగుపట్టి ఉంది. ప్రస్తుతం అక్కడ ఆకులు, అలుములతో చెత్తాచెదారం పేరుకుపోయింది. కాగా, మృతదేహం కనిపించిన ప్రాంతంలో ఖాళీ మద్యం బాటిళ్లతో కూడిన ఓ పెద్ద క్యారీ బ్యాగు ఉంది.
పాపను చంపి మద్యం సేవించి వెళ్లారా….? లేక….తాజాగా ఎవరైనా పెట్టారా….? తెలియాల్సి ఉంది. అయితే మృతదేహం తరలించే క్రమంలో వాటిని సైతం పోలీసులు, క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకున్నారు.
సీసీ కెమెరాలపై బాధ్యత ఏది…?
బాలిక మృతదేహం లభించిన చోట కొన్ని సాఫ్ట్వేర్, ఇతర వ్యాపార, వాణిజ్య కేంద్రాలతో పాటు ఖరీదైన భవనాలు, బంగ్లాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. నేనుసైతం లాంటి కార్యక్రమాలతో పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా…. ఆ కాలనీలో ఎవరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేదు.
కెమెరాలు లేకపోవడం వల్ల కేసు దర్యాప్తులో కొంత ఇబ్బందులు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. మృతదేహం పడి ఉన్న కొద్ది దూరంలోని మిట్టౌన్ భవనంతో పాటు కాలనీ వెలుపలి కొద్ది దూరంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మృతదేహం పడి ఉన్న చోట పెద్ద చెట్టు అడ్డుగా ఉండటంతో గుర్తింపులో ఆలస్యం జరుగుతున్నది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.