బంజారాహిల్స్ : కుటుంబ కలహాలతో భార్యపై కత్తితో దాడి చేయడంతోపాటు తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయ త్నం చేసిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద్ ప్రాంతానికి చెందిన మానయ్య, పుణ్యమ్మ (50) దంపతుల మధ్యన గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
తరచూ మద్యం సేవించి రావడం, భార్యను కొట్టడంతో పాటు డబ్బులు లాక్కోవడం చేస్తుండే భర్త మానయ్య తీరుపై విసిగిపోయిన పుణ్యమ్మ ఇటీవల బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని మిథిలానగర్లో నివాసం ఉంటున్న తమ్ముడు నగేష్ ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మానయ్య ఆమెను వెతుక్కుంటూ ఈనెల 22న నగేష్ ఇంటికి వచ్చాడు.
అయితే భర్త వస్తున్న విషయాన్ని గురించి తెలుసుకున్న పుణ్యమ్మ ఆయన కంటపడకుండా బయటకు వెళ్లి పక్కనే ఉన్న ఇంట్లో దాక్కొంది. రాత్రంతా భార్యకోసం వేచిచూసిన మానయ్య ఉదయం 7.30 ప్రాంతంలో తాను ఊరికి వెళ్లున్నా నని చెప్పి వెళ్లిపోయాడు. భర్త ఊరికి వెళ్లిపోయాడని భావించిన పుణ్యమ్మ మంగళవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో తమ్ముడి ఇంటికి వచ్చేసింది.
అదే ప్రాంతంలో కాపుకాసిన మానయ్య కాసేపటికి అక్కడకు వచ్చి భార్యతో తీవ్రస్థాయిలో గొడవపడ్డాడు. మాటామాట పెరగడంతో తాళిబొట్టును లాక్కున్నాడు. అంతేకాక తనతోపాటు తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో పుణ్యమ్మ చేతులకు, చాతీపై తీవ్రగాయాలయ్యాయి. భార్యపై దాడి చేసిన అనంతరం కత్తితో కడుపులో పొడుచుకున్న మానయ్య కుప్పకూలాడు.
దీంతో కుటుంబ సభ్యులు వారిద్దరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.