న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ కారు, మరో కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో అది పల్టీలు కొట్టి ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై పడింది. ఈ సంఘటనలో పలువురు గాయపడగా అన్నాచెల్లెళ్లైన ఇద్దరు పిల్లలు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 4.30 గంటలకు లోధి రోడ్ ఫ్లైఓవర్ వద్ద వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు, వ్యాగన్ ఆర్ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారు పల్టీలు కొట్టి ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై పడింది. ఈ ప్రమాదంలో ఆరేండ్ల రోషిణి, పదేళ్ల ఆమె అన్న అమిర్ చనిపోయారు. వ్యాగన్ ఆర్ కారు డ్రైవర్తో సహా ఎనిమిది మంది గాయపడ్డారు.
మరోవైపు బీఎండబ్ల్యూ కారు ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బీఎండబ్ల్యూ కారు యజమానిని గుర్తించారు. అతడి ఇంటికి వెళ్లి ఆరా తీయగా కారును సర్వీస్ కోసం తన మేనల్లుడు సాహిల్ నారంగ్కు ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు నిర్మాణ్ విహార్లో నివాసం ఉంటున్న సాహిల్ ఇంటికి వెళ్లి అతడ్ని అరెస్ట్ చేశారు. సర్వీసింగ్ సెంటర్లో ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు.
కాగా, బీఎండబ్ల్యూ కారును కొత్తగా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ కారును డ్రైవ్ చేస్తున్న సాహిల్ నారంగ్, కారు స్పీడ్ దాని కంట్రోల్ను పరీక్షించే క్రమంలో వ్యాగన్ ఆర్ కారును బలంగా ఢీకొట్టినట్లు వెల్లడించారు.