సిద్దిపేట : ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా మూడు గంటల్లో సిద్దిపేట పోలీసులు 693 కేసులు నమోదు చేశారు. సీపీ డి. జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ను చేపట్టారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్స్ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబంధీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో 1,241 చాలన్లు పెండింగ్లో ఉన్న 320 వాహనాలను పట్టుకున్నారు. వాహన యజమానుల నుండి రూ.6.18 లక్షలను వసూలు చేశారు.
మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న 168 మందిని గుర్తించి ఒక్కోరికి రూ.1000 జరిమానా విధించారు. వీరి వద్ద నుంచి రూ.1.68 లక్షలను వసూలు చేశారు. అదేవిధంగా స్పీడ్ లేజర్ గన్స్ ఉపయోగించి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన 272 మంది వాహనదారులపై జరిమానా విధించారు. తొమ్మిది మంది వ్యక్తలపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. జిల్లాను ప్రమాద రహితంగా మార్చేందుకు వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిందిగా సీపీ తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.