కరీంనగర్ : ఆస్తి కోసం ఓ నలుగురు అన్నదమ్ముళ్లు కాల్పుల డ్రామా ఆడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కరీంనగర్ పట్టణంలోని శేషామహల్ ప్రాంతానికి చెందిన ఆస్గర్ హుస్సేన్, శంషాద్ హుస్సేన్, అన్వర్ హుస్సేన్, మునవార్ హుస్సేన్, అల్తాప్ హుస్సేన్ అన్నదమ్ముళ్లు. వీరంతా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ ఐదుగురు అన్నదమ్ముళ్ల మధ్య ఆస్తి వివాదాలు నెలకొన్నాయి.
రెండు రోజుల క్రితం మళ్లీ ఆస్తుల కోసం గొడవలు జరిగాయి. ఆస్గర్ హుస్సేన్ను శుక్రవారం రాత్రి దారుణంగా కొట్టారు. ఈ దాడిని తప్పుదోవ పట్టించేందుకు నలుగురు అన్నదమ్ముళ్లు కాల్పుల డ్రామా ఆడారు. ఈ నేపథ్యంలో ఆస్గర్ హుస్సేన్పై మిగతా నలుగురు కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్గర్ తమపై కత్తితో దాడి చేయడమే కాకుండా రివాల్వర్తో కాల్పులు జరిపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బుల్లెట్ కారు అద్దానికి తగలడంతో అది రంధ్రం పడినట్లు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్గర్ కాల్పులు జరపలేదని పోలీసుల విచారణలో తేలింది. కారు అద్దానికి రాయితో రంధ్రం చేశారని పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం రాత్రి గొడవ జరిగిన సమయంలో కొందరు వీడియోలను చిత్రీకరించారు. వాటిని కూడా పరిశీలించగా.. ఆస్గర్ ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. ఆస్తి కోసమే కాల్పుల డ్రామా ఆడారని పోలీసులు పేర్కొన్నారు.