ముంబై: షీనాబోరా హత్యకేసులో ఆమె తల్లి, ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా ఇచ్చిన ట్విస్ట్పై దర్యాప్తు కొనసాగుతున్నది. తన కూతురు షీనాబోరాను తాను హత్య చేయలేదని, ఆమె కశ్మీర్లో ఉన్నదని, తనతోపాటు ముంబై బైకులా జైల్లో ఉన్న ఓ మహిళా ఖైదీ కశ్మీర్లో తాను షీనాతో మాట్లాడినట్లు వెల్లడించిందని ఇంద్రాణి ముఖర్జియా ఇటీవల వెల్లడించారు. అంతేగాక షీనాబోరా బతికే ఉన్నదన్న అంశంపై దర్యాప్తునకు ఆదేశించాలని సీబీఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు.
ఇంద్రాణి ముఖర్జియా పిటిషన్ను విచారణకు స్వీకరించిన సీబీఐ న్యాయస్థానం.. షీనా బతికే ఉన్నదనే అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేసు దర్యాప్తు చేసిన సీబీఐని ఆదేశించింది. అయితే, ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి తమకు 14 రోజుల సమయం ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును అభ్యర్థించారు. కాగా, ఇటీవల బెయిల్ కోసం ఇంద్రాణి వేసిన పిటిషన్ను కూడా సీబీఐ తిరస్కరించింది. దాంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నది.
ఇదిలావుంటే షీనాబోరా హత్యకేసు 2015లో వెలుగులోకి వచ్చింది. తల్లి ఇంద్రాణి ముఖర్జియే షీనాబోరాను హత్య చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. దాంతో ఆమె, ఆమె రెండో భర్త సంజయ్ ఖన్నా, మూడో భర్త పీటర్ ముఖర్జియా తోపాటు ఇంద్రాణి డ్రైవర్ ఈ కేసులో అరెస్టయ్యారు. పీటర్ ముఖర్జియా బెయిలుపై బయటికి వెళ్లి ఇంద్రాణికి డైవర్స్ ఇచ్చాడు. ఇంద్రాణికి మిగతా నిందితులకు మాత్రం ఇప్పటికీ బెయిల్ రాలేదు.