నిర్మల్ అర్బన్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో రెండున్నర సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న సంఘటన జరుగగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి గురువారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు నిర్మల్ ఏఎస్పీ రాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. కాగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ స్థానికులు ఆందోళన చేయడంతో పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని ఓ వార్డులో అద్దె ఇంట్లో నివాసముంటున్న చింతల నారాయణ అనే వ్యక్తి భార్య 8 సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటి నుంచి అతడు ఒక్కడే అందులో నివాసముంటున్నాడు.
ఈనెల 4న చిన్నారి ఆడుకుంటుండగా ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడడంతో చిన్నారి వేసిన కేకలకు చిన్నారి తల్లి అక్కడికి వెళ్లగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం రాత్రి నిందితుడిని పట్టుకుని గురువారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, జైలుకు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు . అతనిపై పీడీ యాక్టు కేసు నమోదు చేశామని, అతడికి బెయిల్పై రాకుండా చూస్తామన్నారు. కేసు చార్జిషీటును వీలైనంత తొందరగా కోర్టులో దాఖలు చేయడం జరుగుతుందని, ఈకేసులో నిందితుడికి శిక్ష పడేలా చూస్తామన్నారు.ఈ విలేకరుల సమావేశంలో నిర్మల్ డీయస్పీ ఉపేందర్ రెడ్డి ఉన్నారు.
ఇదిలా ఉండగా చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పట్టణానికి చెందిన ప్రజలు ఊరేగింపు నిర్వహించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అనంతరం వారు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, జిల్లా ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్, షేక్ సలీం, జహీర్, ముజ్జు, అన్వర్, మతిన్, హీద్ ఉద్దీన్, సల్మాన్, ముజాయిద్ తదితరులున్నారు.