ముంబై : పోలీసులు అప్రమత్తమై ప్రజల్లో అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు (cyber fraud) చెలరేగుతూనే ఉన్నారు. ముంబైలో 70 ఏండ్ల మహిళ ఆన్లైన్లో టవల్స్ కొనుగోలు చేస్తుండగా టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి రూ. 8.3 లక్షలు కొల్లగొట్టారు. మిరా రోడ్డుకు చెందిన వృద్ధురాలు ఈ-కామర్స్ సైట్లో ఆరు టవల్స్ను రూ. 1160కు ఆర్డర్ ఇచ్చారు.
ఆన్లైన్ పేమెంట్ చేసే క్రమంలో రూ. 1169కు బదులు ఆమె ఖాతా నుంచి రూ. 19,005 డెబిట్ అయ్యాయి. దీంతో బ్యాంకు హెల్ప్లైన్ నెంబర్కు ఆమె కాల్ చేయగా కాంటాక్ట్ కాలేదు. ఆపై కొద్దిసేపటికి గుర్తుతెలియని నెంబర్ నుంచి ఆమెకు తాము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ కాల్ వచ్చింది. ఆన్లైన్ లావాదేవీలో సమస్యను పరిష్కరిస్తామని నమ్మబలికారు. రిఫండ్ కోసం యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కాల్ చేసిన వ్యక్తి ఆమెను కోరాడు.
అతడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ను ఆమె పూర్తిచేసే క్రమంలో మహిళ ఖాతా నుంచి రూ. లక్ష డెబిట్ అయ్యాయి. తన అనుమతి లేకుండా జరిగిన లావాదేవీలపై ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈలోగా మొత్తం రూ. 8.3 లక్షలు ఆమె ఖాతా నుంచి విత్డ్రా అయ్యాయి. ఈ మొత్తం యూపీకి చెందిన ఓ వ్యక్తి ఖాతాలో చేరినట్టు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు తెలిపారు.