బెంగళూరు: దొంగగా భావించిన సెక్యూరిటీ గార్డులు ఒక బ్యాంకు ఉద్యోగిని కొట్టి చంపారు. దీంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఒడిశాకు చెందిన 27 ఏళ్ల అభినాష్ పతి ఒక ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్నాడు. శిక్షణ కోసం బెంగళూరు వచ్చాడు. మారతహళ్లి ప్రాంతంలోని వంశీ సిటాడెల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అన్న స్నేహితులున్న ఫ్లాట్లో వారితో కలిసి ఉంటున్నాడు.
ఈ నెల 3న అభినాష్ తన స్నేహితులతో కలిసి పార్టీ కోసం రాత్రి వేళ బయటకు వెళ్లాడు. అర్ధ రాత్రి దాటిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా అతడి మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. మరోవైపు అపార్ట్మెంట్కు వెళ్లే దారి కూడా మరిచిపోయాడు. చివరకు 2 గంటల సమయంలో అపార్ట్మెంట్ను గుర్తించి అక్కడకు చేరుకున్నాడు. అయితే గేట్ మూసి ఉండటంతో సెక్యూరిటీ గార్డుల నుంచి తప్పించుకునేందుకు గేటు నుంచి దూకాడు. అపార్ట్మెంట్లోకి వెళ్తుండగా నైట్ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులు శ్యామ్నాథ్, అజిత్ అతడ్ని అడ్డుకున్నారు. వివరాలు అడగ్గా మద్యం మత్తులో ఉన్న అభినాష్ ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న అన్న స్నేహితుల వివరాలు చెప్పలేకపోయాడు.
దీంతో దొంగగా అనుమానించిన సెక్యూరిటీ గార్డులు ఐరన్ రాడ్తో అభినాష్ తలపై కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడు చనిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. దొంగగా పొరపడి బ్యాంకు ఉద్యోగిని హత్య చేసిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులను అరెస్ట్ చేశారు.