మహబూబాబాద్ : జిల్లాలోని మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. పద్నాలుగు రోజులు రిమాండ్ విధించగా మహబూబాబాద్ సబ్-జైల్కు తరలించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదన్నారు. తప్పు చేస్తే ఎంతటివారైనా సరే శిక్షింపబడతారని స్పష్టం చేశారు. కేసు పురోగతిలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామన్నారు.
సోమవారం విధి నిర్వహణలో భాగంగా మరిపెడ ఎస్హెచ్వో శ్రీనివాసరెడ్డి, ప్రొబేషనరీ ఎస్సైతోపాటు సిబ్బంది అటవీప్రాంతంలో నల్లబెల్లం వ్యాపారులపై దాడికి వెళ్లారు. సిబ్బందిని ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించిన ఎస్హెచ్వో.. తనపై లైంగికదాడికి యత్నించాడని బాధితురాలు వరంగల్ సీపీ తరుణ్జోషికి ఫిర్యాదుచేశారు.
కాసేపటికి సిబ్బంది తిరిగి రావటంతో తాను మరో వాహనంలో మరిపెడకు చేరుకున్నట్టు వివరించారు. దీంతో ఎస్సై శ్రీనివాసరెడ్డిని నార్త్జోన్ ఐజీ, వరంగల్ రేంజ్ ఎఫ్ఏసీ(ఫుల్ అడిషనల్ చార్జి) డీఐజీ వై నాగిరెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను నియమించారు.