హయత్నగర్ : జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఆర్ఎంపీ డాక్టర్ లాప్టాప్స్ చోరీకి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద రూ.5 లక్షల విలువైన 16 లాప్టాప్స్, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈ మేరకు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి కేసు వివరాలను వెల్లడిం చారు. భద్రాచలం, జగదీష్ కాలనీకి చెందిన గుడికాని నవీన్కుమార్ (41) ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నా డు.
జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పథకం రూపొందించాడు. రాత్రిపూట బస్సుల్లో అతను ప్రయాణిస్తూ ప్రయాణికుల వద్ద లాప్టాప్స్, సెల్ఫోన్లు అపహరించి రిపేర్ షాపుల్లో వాటిని విక్రయిస్తుంటాడు. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ఏరియాల్లో నిందితుడు నవీన్కుమార్ పలు ట్రావెల్ బస్సుల్లో లాప్టాప్స్ దొంగతనాలకు పాల్పడ్డాడు.
పనామా చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నవీన్కుమార్ను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు, వనస్థలిపురం పోలీసులు కలిసి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించాడు. అతని వద్ద రూ.5 లక్షలు విలువైన 16 లాప్టాప్స్, 5 సెల్ఫోన్లు, 2 పవర్ బ్యాంక్స్, 1 వ్రిస్ట్ వాచ్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్స్ టి.మహేష్, కె.సత్యనారాయణ, జి.జగన్నాధ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.