జైపూర్: ఒక మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. అయితే ఆ తల్లి ప్రాణాలతో బయటపడగా, నలుగురు చిన్న పిల్లలు మరణించారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. కుటుంబంలో గొడవల వల్ల 32 ఏళ్ల మాటియా కఠిన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి తన నలుగురు పిల్లలతో కలిసి మంగళియవాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో బావిలోకి దూకింది. గమనించిన స్థానికులు ఆ మహిళను కాపాడారు. బావి నుంచి ఆమెను బయటకు తీశారు.
మరోవైపు బావిలో పడిన నలుగురు పిల్లలు చనిపోయారు. నాలుగేళ్ల కోమల్, మూడేళ్ల రింకు, 22 నెలల రాజ్వీర్ మృతదేహాలను శుక్రవారం రాత్రి వేళ బావి నుంచి బయటకు తీశారు. నెల రోజుల పసి బాలుడు దేవరాజ్ మృతదేహాన్ని మాత్రం శనివారం ఉదయం వెలికితీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్మార్టం కోసం నలుగురు పిల్లల మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మాటియా భర్త బోదురామ్ గుర్జర్, రైతు అని పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పారు.