జైపూర్: భర్తను భార్య క్రికెట్ బ్యాట్తో చితకబాదింది. అరుపులు విన్న స్థానికులు ఆ భర్తను రక్షించారు. అయితే భార్యాభర్తలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. రాజస్థాన్లోని బికనీర్లో ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తలు అనీషా, అమీన్.. రిద్మల్సర్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. వారిద్దరూ తరచుగా గొడవపడుతుంటారు. అయితే మంగళవారం రాత్రి 11 గంటలకు భార్య అనీషా తన భర్త అమీన్ను క్రికెట్ బ్యాట్తో చితకబాదింది. దీంతో అతడు కేకలు వేయడంతో పొరుగున ఉండేవారు ఆ ఇంటికి వెళ్లారు. అనీషా నుంచి క్రికెట్ బ్యాట్ లాక్కొని భర్తను కాపాడారు. రక్తం కారుతూ తీవ్రంగా గాయపడిన అమీన్ను ఆసుపత్రికి తరలించారు. దీంతో అతడి తలకు 17 కుట్లు పడ్డాయి.
మరోవైపు అమీన్ కుటుంబ సభ్యులు అతడి భార్య అనీషాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కౌంటర్గా ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాగి వచ్చి తనను కొడుతున్నాడని, గృహ హింసకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. దీంతో ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వారిద్దరిపై కేసులు నమోదు చేశారు. గాయపడిన భర్త కోలుకున్న తర్వాత అతడి స్టేట్మెంట్ రికార్డు చేస్తామని చెప్పారు. మరోవైపు భార్య తన భర్తను క్రికెట్ బ్యాట్తో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.