ముంబై : బ్యాంక్ ఖాతాల నుంచి క్షణాల్లో సొమ్ము మాయం చేస్తూ సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. వైన్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు ప్రయత్నించిన మహిళ (32) నుంచి నేరగాళ్లు రూ 4.8 లక్షలు కాజేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా పొవై పోలీస్ స్టేషన్లో సైబర్ నేరగాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏప్రిల్ 4న బాధితురాలి ఇంటికి ఆమె వదిన రాగా, ఈలోగా మహిళ ఆమె భర్త స్ధానిక వైన్ షాపు నుంచి వైన్ను ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించారు. గూగుల్లో సమీప వైన్ షాపుల గురించి సెర్చ్ చేశారు.
ఈ క్రమంలో పొవైలోని ఓం సాయి బీర్ షాపును గుర్తించిన మహిళ అక్కడున్న ఫోన్ నెంబర్కు కాల్ చేసింది. తాము క్యాష్ ఆన్ డెలివరీని అంగీకరించడం లేదని రూ 650 గూగుల్ పే ద్వారా పంపాలని నేరగాడు బదులిచ్చాడు. అయితే రూ 30 ఎక్కువ పంపారని చెంపిన నిందితుడు ఆమెకు ఆ మొత్తం తిరిగి పంపుతానని క్యూఆర్ కోడ్ పంపాడు.
క్యూఆర్ కోడ్ను ఆమె స్కాన్ చేయగానే రూ 19,991 ఖాతా నుంచి నిందితుడి ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ విషయం అతడికి తెలపడంతో పొరపాటు జరిగిందని ఆ మొత్తం రిటన్ చేస్తానంటూ మరో క్యూఆర్ కోడ్ పంపాడు. తిరిగి ఆ కోడ్ను ఆమె స్కాన్ చేయగానే ఈ సారి ఏకంగా రూ 96,108 బాధితురాలు ఖాతా నుంచి కట్ అయ్యాయి. ఇలా ఏకంగా రూ 4.80 లక్షల వరకూ ఆమె నుంచి నిందితుడు కాజేశాడు. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.