అమరావతి: రాత్రి వేళ రైలు ఎక్కేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్లో వేచి ఉన్న గర్భిణీని కొందరు కిడ్నాప్ చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లే రైల్వే స్టేషన్లో ఈ దారుణం జరిగింది. భార్యాభర్తలు తమ ముగ్గురు పిల్లలతో కలిసి కృష్ణా జిల్లాలోని ఊరికి రైలులో వెళ్లేందుకు శనివారం రాత్రి రేపల్లే రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. రైలు రావడానికి సమయం ఉండటంతో స్టేషన్లోని బెంచీలపై నిద్రించారు.
కాగా, అర్థరాత్రి తర్వాత మద్యం సేవించిన కొందరు అక్కడకు వచ్చారు. గర్భిణీ భర్తను కొట్టారు. అడ్డుకోబోయిన భార్యను రైల్వే స్టేషన్ సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెల్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె భర్త రైల్వే పోలీస్ సహాయం కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలో చెట్ల పొదల వద్ద ఉన్న బాధిత మహిళను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సామూహిక లైంగిక దాడి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.