లక్నో : స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో అశ్లీల చిత్రాలు, అసభ్య కామెంట్లు పోస్ట్ కావడం కలకలం రేపింది. లక్నో యూనివర్సిటీ ఏఐహెచ్ఏ డిపార్ట్మెంట్ అండర్గ్రాడ్యుయేట్ విద్యార్ధులు ఏర్పాటు చేసుకున్నవాట్సాప్ గ్రూప్లో అభ్యంతరకర కంటెంట్ దర్శనమిచ్చింది. వర్సిటీ చీఫ్ ప్రోక్టర్ ఈ ఉదంతంపై హసన్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నీలి చిత్రాలు, అసభ్య కామెంట్లు పోస్ట్ చేసిన దుండగుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
పేపర్ ప్రజెంటేషన్స్ షేర్ చేసేందుకు ఫ్యాకల్టీ కోరడంతో ఓ విద్యార్ధిని ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. టీచర్లు షేర్ చేసిన లింక్ ద్వారా 170 మంది వరకూ విద్యార్ధినీ విద్యార్ధులు ఈ గ్రూప్లోకి వచ్చారు. ఈ చిత్రాలు పోస్ట్ చేసిన వ్యక్తి ఇదే గ్రూపుకు చెందిన విద్యార్ధి మొబైల్ నెంబర్ను చూపిస్తోందని తెలిసింది.
అయితే ఈ ఘటనతో తనకు సంబంధం లేదని అతడు చెబుతున్నట్టు సమాచారం. శనివారం అర్ధరాత్రి నుంచి గ్రూప్ సభ్యుడు వాట్సప్ గ్రూప్లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేయడం ప్రారంభించాడని ఓ విద్యార్ధిని చెప్పారు. ఆపై క్లాస్లోని నలుగురు విద్యార్ధినులను లక్ష్యంగా అసభ్య కామెంట్లు పోస్ట్ చేశాడని, ఆపై ఫ్యాకల్టీ సభ్యులను కించపరిచే పోస్టులు పెట్టాడని ఆమె తెలిపారు. దీంతో తాను వర్సిటీ ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ ఈ వ్యవహారంపై దృష్టిసారించాలని కోరానని చెప్పారు.