చెన్నై : సేతుపతి వంశానికి చెందిన 400 ఏండ్ల నాటి పురాతన రాణి విగ్రహాన్ని తమిళనాడు పోలీసులు తిరుచ్చి-మధురై హైవేపై స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఈ పురాతన విగ్రహం విలువ రూ 2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ విగ్రహాన్ని అమ్మేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నేరానికి సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుకుడికి చెందిన ఆర్ముగరాజ్ (56), కుమరవేల్ (32) పురాతన విగ్రహాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.
విగ్రహ స్మగ్లర్లపై సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు మధురై రేంజ్ ఏడీఎస్పీ మలైసామి నేతృత్వంలో బృందంగా ఏర్పడి నిందితుల ఆట కట్టించారు. విగ్రహాన్ని కొనుగోలు చేస్తామంటూ నిందితులతో బేరసారాలకు దిగారు. తాము పురాతన విగ్రహాలను సేకరిస్తామని అంటూ నిందితులకు నమ్మబలికి నిందితులు ముస్తాఫా, ఆర్ముగరాజ్, కుమరవేల్ను అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి నుంచి తాము ఈ విగ్రహాన్ని పొందామని దర్యాప్తులో వారు వెల్లడించారు. శివగంగై జిల్లాకు చెందిన కొబ్బరికాయల వ్యాపారి నుంచి తన తండ్రి ఈ విగ్రహాన్ని పన్నెండేండ్ల కిందట తీసుకున్నారని తండ్రి మరణానంతరం తాను దీన్ని విక్రయానికి పెట్టానని సెల్వకుమార్ పోలీసులకు తెలిపాడని తమిళనాడు పోలీస్ ఐడల్ వింగ్ అధికారులు పేర్కొన్నారు.